Sunday 25 November 2018

పల్లీలు-నువ్వు పప్పు పొడి / నువ్వుల పొడి

పల్లీలు  నువ్వుల పొడి.

పల్లీలు వేసుకోకుండా నువ్వుల పొడిగా కూడా చేసుకోవచ్చు.

కావలసినవి .

పల్లీలు  --  200 గ్రాములు
తెల్ల నువ్వులు --  100  గ్రాములు
ఎండుమిరపకాయలు  --  10
జీలకర్ర  --  స్పూను
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  పల్లీలు   స్టౌ  మీద  బాండి  పెట్టి  పల్లీలు  నూనె  వేయకుండా  కమ్మని వాసన  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  పై పొట్టు  తీసి  వేరుగా  ఉంచుకోవాలి .

మళ్ళీ   స్టౌ మీద బాండి  పెట్టి  తెల్ల నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్ర  నూనె  వేయకుండా    వేగిన  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  వేయించిన  పల్లీలు , నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  సరిపడే  ఉప్పువేసి   మిక్సీ లో  మెత్తగా  వేసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు  మరియు  భోజనము  లోకి  రుచికరమైన  పల్లీలు  నువ్వుపప్పు   పొడి  సిద్ధం.

Monday 19 November 2018

వంకాయ పచ్చి పులుసు

కావలసినవి .

లేత  నీలం రంగు గుండ్రని వంకాయలు  --  మూడు .
ఉల్లిపాయలు  --  రెండు
పచ్చి మిరపకాయలు  --  అయిదు
చింతపండు  --  నిమ్మ కాయంత.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా

పోపునకు .

నూనె  --   మూడు స్పూన్లు
ఎండు మిరపకాయలు  --  4
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  -పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను.
ఇంగువ  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  ఒక  గ్లాసు  నీళ్ళలో పదిహేను  నిముషాలు  పాటు నానబెట్టి  తర్వాత  ఒక  గ్లాసు రసం  పల్చగా  తీసుకోవాలి .

వంకాయలు  పుచ్చులు  లేకుండా  చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి  స్టౌ  మీద  సన్నని సెగలో  కాల్చుకోవాలి .

నీళ్ళతో  తడి  చేసుకుని  కాయలపై  పొట్టు  అంతా  తీసేసుకోవాలి.

పై తొడిమలు  తీసివేసి కాయలను  వేరే ప్లేటులో  పెట్టుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసి  నూనె బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు  ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి  ముక్కలు మరియు  కరివేపాకు  వేసుకుని పోపు వేగగానే  అందులో  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  పది నిముషాలు  పాటు  ఉల్లిపాయ  ముక్కలు  బంగారు  రంగులోకి  వచ్చే వరకు  మగ్గ నివ్వాలి .

ఒక  గిన్నెలో  చింతపండు  రసము  వేసుకుని , అందులో కొద్దిగా  పసుపు , సరిపడా  ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క , తొడిమలు తీసిన వంకాయలు   అందులో  వేసి  చేతితో  బాగా  కలిసేలా  పిసకాలి .

తర్వాత  ఉల్లిపాయలు తో  వేయించిన  పోపు  మరియు  సన్నగా  తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  రోటీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  పచ్చి  పులుసు  సర్వింగ్  కు సిద్ధం.

కొంతమంది  ఉల్లి పాయలు  వేయించకుండా  పచ్చివే  కలుపుతారు .

ఇష్టమైన వారు  అర స్పూను  పంచదార కాని  బెల్లపు  పొడి కాని  వేసుకోవచ్చు .

దీనికి   కాంబినేషన్  గా  కందిపచ్చడి లేదా కందిపొడి  చేసుకుంటారు .

చాలా రుచిగా  ఉంటుంది .

ఈ వంకాయ పచ్చిపులుసును వేడి  చెయ్యరు.